ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప‌దోన్న‌తి

VijayaBhaskar · December 27, 2025
Spread the love

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప‌నితీరు ఆధారంగా పలువురు ఐఏఎస్ ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ‌నివారం జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇదిలా ఉండ‌గా 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) క్యాడర్‌కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ కార్యదర్శులు గా పదోన్నతి పొందిన అధికారులలో చదలవాడ నాగరాణి , డా. నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కటా, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారని పేర్కొన్నారు.

పదోన్నతుల అనంతరం డా. నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా, ఆర్‌యూఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్న‌ట్లు తెలిపార. ఇక అమ్రపాలి కటా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్ గా మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారని పేర్కొన్నారు సీఎస్. గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్‌గా నియమిస్తూ, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబును రిలీవ్ చేశామ‌న్నారు. ఇక‌ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా అదే పదవిలో కొనసాగుతార‌ని స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్, క్యాడర్ సమానత్వానికి సంబంధించిన ఉత్తర్వులు వేరుగా జారీ చేస్తామని ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్ల‌డించారు.