newsseals.com
News

ప్రాజెక్టుల కోసం మ‌రోసారి కేసీఆర్ పోరాటం

VijayaBhaskar December 29, 2025
newsseals-KTR
Spread the love

ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే ఈ ఉద్య‌మానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి కమీష‌న్ల‌ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఘాటుగా విమర్శించారు. ఇవాళ ఎందుకు పెద్దఎత్తున ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారో ఆలోచించాలన్నారు. రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబంధు పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు.

రైతులు యూరియా బస్తాల కోసం కాళ్లమీద పడి గోస పడుతున్నారని, చలిలో చెప్పులు క్యూలైన్‌లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. రేవంత్‌కు రైతుల పట్ల ప్రేమ లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తు చేశారు. రేవంత్ ఎక్కడికి పోయినా ఆవు కథ లెక్క కేసీఆర్ మీద ఏడుపే కనిపిస్తుందని అన్నారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని ఎద్దేవా చేశారు. సీఎంకు ద‌మ్ము, ధైర్యం ఉంటే తాము చేసిన స‌వాల్ ను స్వీకరించాల‌న్నారు. ఇచ్చిన 420 హామీల సంగ‌తి ఏమిటో చెప్పాల‌న్నారు.