కొత్త‌గా ఏపీలో 1500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

VijayaBhaskar · January 1, 2026
Spread the love

ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం

అమ‌రావ‌తి : కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు కొత్త‌గా 1,500 విద్యుత్ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. బ‌స్సుల కోసం మ‌ద్ద‌తుగా ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది.రాజ మహేంద్రవరం పుష్కరం సమయంలో ప్రారంభ విస్తరణ లక్ష్యంగా పెట్టుకుని కొత్త‌గా బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ఏపీఎస్ఆర్టీసీ యాక్ష‌న్ ప్లాన్ రూపొందించింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ప్రస్తుతం బస్ స్టేషన్లు, డిపోల ఆధునీకరణ జరుగుతోందని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు వెల్ల‌డించారు. గుర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

RTC హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో APSRTC సిబ్బంది నిబద్ధతతో చేసిన కృషి రవాణా సంస్థపై ప్రభుత్వ విశ్వాసం, ప్రశంసలను పొందిందని అన్నారు. ఈ సద్భావనను కాపాడు కోవాలని, అదే అంకితభావంతో పని చేయడం కొనసాగించాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పథకాన్ని 2025లో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఈ పథకాన్ని డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది, అన్ని స్థాయిలలోని ఉద్యోగులు దోషరహితంగా అమలు చేయడం వల్ల APSRTCపై ప్రభుత్వానికి నమ్మకం పెరిగిందని చెప్పారు.