newsseals.com
News

ఖ‌మ్మం ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగరాలి

VijayaBhaskar January 26, 2026
newsseals-Ponguleti
Spread the love

దిశా నిర్దేశం చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ఖ‌మ్మం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రానున్నాయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇల్లందులో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఏ ఒక్క సీటు కూడా ప్ర‌తిపక్ష పార్టీల‌కు ద‌క్క కూడ‌ద‌న్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం అని స్ప‌ష్టం చేశారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. రెండు మూడు రోజుల్లో పుర‌పాలిక సంఘం ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌న్నారు. వారసత్వ రాజకీయాలకు చోటు లేదని స్ప‌ష్టం చేశారు. నా రక్త సంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వనని ప్ర‌క‌టించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నామ‌న్నారు.

టికెట్ల కేటాయింపు లో ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంద‌న్నారు. పైర‌వీల‌కు తావు లేద‌న్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దు అని అన్నారు. అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దు అని సూచించారు. అటువంటి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంద‌న్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.