కార్మికుల‌కు స‌కాలంలో వేత‌నాలు చెల్లించాలి

VijayaBhaskar · February 3, 2026
Spread the love

కేంద్ర స‌ర్కార్ ను కోరిన ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి

న్యూడిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి పార్ల‌మెంట్ సాక్షిగా ఉపాధి హామీ ప‌థ‌కం తీరు తెన్నుల‌పై ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కార్మికుల‌కు స‌కాలంలో వేత‌నాలు చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఎంపీ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర మంత్రి క‌మ‌లేష్ పాశ్వాన్ స‌మాధానం ఇచ్చారు. విబి జి రామ్ జి పథకం కింద ప్రత్యేకంగా వేతనాలు నోటిఫై చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఎంజిఎన్ఆర్ఇజిఎస్ వేతనాలే వర్తిస్తాయని తెలిపారు కేంద్ర మంత్రి క‌మ‌లేష్ పాశ్వాన్. గ్రామీణ కార్మికులకు వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్ల‌డించారు .

వారానికి ఒకసారి లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలనే నిబంధనను చట్టం కల్పించిందన్నారు. మస్టర్ రోల్ పూర్తయిన తేదీ నుంచి 15 రోజుల్లో వేతనాలు చెల్లించకపోతే, ఆలస్యానికి పరిహారం పొందే హక్కు కార్మికులకు ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి కూడా చట్టంలో స్పష్టంగా పొందు పరచినట్లు మంత్రి వివరించారు. ఈ విధంగా విబి జి రామ్ జి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు వేతన భద్రత, పారదర్శకత, సమయ పాలన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన ఏర్పాట్లు చేసిందని క‌మ‌లేష్ పాశ్వాన్ వెల్లడించారు.