అత్యధికంగా ఏపీ సర్కార్ వర్తింపు
అమరావతి : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ దూరదృష్టి గల నిర్ణయాలతో రానున్న రోజుల్లో పామాయిల్ సాగు మరింత విస్తరిస్తుందని, రాష్ట్రం ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన, సీఎం చంద్రబాబు సారధ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా 2025-26 ఆయిల్ ఇయర్ (నూనె సంవత్సరం) కు గాను 20.01% ఆయిల్ ఎక్సట్రాక్షన్ రేషియో (OER) ను ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర పామ్ ఆయిల్ రైతులకు మెట్రిక్ టన్నుకు రూ. 20,680/- ధర లభించిందని, జనవరి నెలకు గాను తెలంగాణ రాష్ట్ర పామ్ ఆయిల్ రైతులకు మెట్రిక్ టన్నుకు రూ.20,456/- లు లభించగా, మన రైతులకు రూ. 20,680/- ల ధర లభించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ కన్నా మన రైతులకు మెట్రిక్ టన్నుకు రూ. 224/- అదనంగా లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, లాభదాయక పంటగా మలుస్తున్నారని అన్నారు.





