newsseals.com
News

క‌మ‌లం హ‌స్తం రెండు పార్టీలు ఒక్క‌టే

VijayaBhaskar February 6, 2026
newsseals-PadiKaushikReddy
Spread the love

నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి 420లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలు, కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అసాధ్యమైన, అమలుకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలే మిగిలాయని విమర్శించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో రైతును రాజుగా చేసి, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తు చేశారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినవేనని స్పష్టం చేశారు.