ఫోరెన్సిక్ ల్యాబ్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాలి

VijayaBhaskar · February 9, 2026
Spread the love

దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంద‌న్న మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో కీల‌క‌మైన ఫైళ్లు ద‌గ్దం అయ్యాయ‌న్న అనుమానం ఉంద‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం ముమ్మాటికీ కుట్రేన‌ని ఆరోపించారు. ఆధారాలు కాలి పోవ‌డంతో అంతా బ‌య‌ట‌కు వస్తార‌ని అన్నారు.
హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను రేవంత్‌ దగ్ధం చేయించాడ‌ని మండిప‌డ్డారు. ల్యాబ్‌ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ముఖ్య‌మైన కార్యాల‌యంలో ఎవ‌రూ ఎందుకు ఉండ‌ర‌ని ప్ర‌శ్నించారు. 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ ఎందుకు ఉందో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ లో చోటు చేసుకున్న ఫైళ్ల ద‌గ్దం ఘ‌ట‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే రిటైర్డ్ జ‌డ్జి తో విచార‌ణ జ‌రిపించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడమేంది? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ లేక పోవడమేంది? నిన్న ప్రమాదం పెద్దగా జరుగలేదని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మొత్తం 2015 నుంచి పదేండ్లకు సంబంధించి అనేక కేసుల సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి చేయించిన పనేన‌ని అర్థం అవుతుంద‌న్నారు.