ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర : ష‌ర్మిలా రెడ్డి

VijayaBhaskar · February 13, 2026
Spread the love

వైఎస్సార్ ఆశ‌యాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం

ప్ర‌కాశం జిల్లా : ఉపాధి హ‌మీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర‌కు తెర లేపిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర శుక్ర‌వారం ప్ర‌కాశం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ఆమె ప్ర‌సంగించారు. పీఎం మోదీ కావాల‌ని మ‌హాత్మా ఉపాధి హ‌మీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేశార‌ని, ఉన్న చ‌ట్టానికి మంగ‌ళం పాడేందుకు శ్రీ‌కారం చుట్టార‌ని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. కూలీల పాలిట శాపంగా మారిందన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం దారుణ‌మ‌న్నారు. YSR ఆశయాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం అన్నారు.

ఆనాడు 2006 లో దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ప్రారంభం అయిందన్నారు. YSR హయాంలో ఉపాధి హామీ పని పండుగలా నడిచిందని చెప్పారు ష‌ర్మిలా రెడ్డి. కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాన్ని రాష్ట్రంలో అద్భుతంగా YSR ఉపయోగించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి మన్రేగా పథకం దోహద ప‌డింద‌న్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక ఉపాధి హామీ పనిపై కుట్రలు చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పూర్తిగా దేశంలో ఈ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తుందన్నారు. అందుకే పథకం ప్రకారం మన్రేగా ను చంపి కొత్త చట్టం తెచ్చారని మండిప‌డ్డారు. మోదీ తెచ్చిన VB G – RAM G చట్టం అక్రమ చట్టం అని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి.