ధరల స్థిరీకరణకు కృషి చేస్తామన్న మంత్రి
అమరావతి : ఏపీ సర్కార్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర కల్పించడానికి, ధరలు స్థిరీకరించడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు . డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటివద్దకే నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా..ఏ ఒక్క రైతూ నష్ట పోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టామన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.
దాదాపు రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చుచేసి సుమారు లక్ష మంది రైతులను ప్రభుత్వం ఆదుకుందని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. ఇందులో తోతాపూరి మామిడి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్ట పరిహారం కింద హెక్టారుకు రూ.25 వేలు ఉన్న పరిహారాన్ని 50 వేల రూపాయలకు పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. అలాగే, పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించడ జరిగిందన్నారు. 2026-27లో ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా ఎంతైనా ఖర్చుపెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. 2026-27లో మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు.






