శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు
అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని , శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని కలిశారు. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వయంగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్బంగా స్పీకర్ కీలక సూచనలు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు జాబ్స్ కోసం కాకుండా రాజకీయాలలో చేరేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. చట్టాలను చేసే అత్యున్నత దేవాలయం కేవలం శాసన సభ, శాసన మండలి మాత్రమేనని చెప్పారు. ఈ దేశం నడుస్తున్నది కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని, దీనిని మీరు తప్పకుండా తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఇదిలా ఉండగా అసెంబ్లీని సందర్శించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.






