కీలక సూచనలు చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి : జీవితంలో అత్యున్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాలని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండాలని స్పష్టం చేశారు నారా లోకేష్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. గత ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇదే క్రమంలో కీలకమైన విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు నారా లోకేష్. ఇదే క్రమంలో మానవ జీవన పురోభివృద్దిలో కీలక పాత్ర పోషించే గ్రంథాలయాలను అభివృద్ది చేస్తామని ప్రకటించారు .





