newsseals.com
News

పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం : సీఎం

VijayaBhaskar February 26, 2026
newsseals-APCM
Spread the love

శాస‌న స‌భ‌లో నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచు కుంటున్నాం అన్నారు. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి 2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటిపై వ్యయం చేశామ‌ని చెప్పారు. గడచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు చేయగలిగామ‌ని పేర్కొన్నారు సీఎం. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామ‌న్నారు. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు.

వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామ‌ని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా మార్కాపురం, ఒంగోలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామ‌ని పేర్కొన్నారు. 30 ఏళ్ల ముందు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి.. మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తామ‌ని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల మేర ఇంకా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశామ‌ని చెప్పారు. క్రెడిట్ చోరీ చేసే అంశం ఆ పార్టీదేన‌ని పేర్కొన్నారు. వెలిగొండకు నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో పోశారని పేర్కొన్నారు.