వెనక్కి తగ్గిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు.
పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయ కపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జల మండలికి కేటాయింపులు రద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ఈ సందర్భంగా అనుముల రేవంత్ రెడ్డి పీఠం ప్రతినిధులకు సూచించారు. ఇదిలా ఉండగా శారదా పీఠం భూములపై ఉక్కు పాదం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.








