దివ్యాంగుల‌కు ఉచిత ప్ర‌యాణం అబ‌ద్దం

VijayaBhaskar · March 3, 2026
Spread the love

క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సంస్థ త‌ర‌పున మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ ఆదేశాల మేర‌కు మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా ఆర్టీసీలో దివ్యాంగుల (వికలాంగులు) కు ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని తెలిపారు. దీనిపై ఇవాళ ఎండీ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌త్యేకించి వివిధ సోషల్ మీడియాలో TGSRTC బస్సుల్లో దివ్యాంగులకు సంబంధించి వస్తున్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది.

దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్ప‌ష్టం చేశారు ఎండీ. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే ప‌త్రికా ప్ర‌కట‌న ద్వారా లేదా అధికారిక TGSRTC వెబ్‌సైట్ ద్వారా గాని వెల్లడించ‌డం జ‌రుగుతుందని స్ఫష్టం చేశారు నాగిరెడ్డి.