ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాపులేషన్ గురించి చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. సోయి లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన తీసుకు రావాలని అనుకుంటున్న పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉన్న బిడ్డలకే దిక్కులేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా ? అని ప్రశ్నించారు షర్మిలా రెడ్డి. మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారని వారికి ఉపాధి కల్పించడంలో ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు షర్మిలా రెడ్డి. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు మాటేమిటని ప్రశ్నించారు. మీరు, జగన్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారని నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియాలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని చెప్తే ఎలా చంద్రబాబూ అంటూ నిలదీశారు షర్మిలా రెడ్డి.





