రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

VijayaBhaskar · March 10, 2026
Spread the love

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌నంగా మారారు. త‌న‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని సైబ‌ర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లి త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌త్యేకించి సామాజిక మాధ్య‌మాల‌ (సోష‌ల్ మీడియా)లో కావాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా పూర్తిగా చెప్పుకోలేని రీతిలో అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ చేస్తున్నారంటూ వాపోయారు రేణు దేశాయ్.

అనుచిత కామెంట్లపై నటి సీరియస్‌గా స్పందించారు. వ్యక్తిగతంగా దూషిస్తూ కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో సహా తీసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కామెంట్ల స్క్రీన్‌షాట్లు, లింకులు సహా వివరాలను పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని స‌మాచారం.