భగ్గుమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రం లో ఇపుడిపుడే పురుడు పోసుకున్న తెలంగాణ కు కేంద్రం సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 చేపట్టేందుకు కనీసం 24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్నారు. దీనికి కేంద్రం 50% నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందన్నారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ అభివృద్ధి నది శుద్ధి, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం కేంద్ర సహకారం అవసరం అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్ (RRR) హైదరాబాద్ చుట్టూ 330 కి.మీ భారీ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కొంత అనుమతి వచ్చినా, దక్షిణ భాగం ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన కారిడార్ కోసం కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి పూర్తి ఆమోదం లభించాల్సి ఉందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ఇచ్చిన హామీ నెరవేర్చ లేదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 లో ప్రతిపాదించిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ కు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణ కు ఎందుకు ఇవ్వరంటూ భగ్గుమన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.





