స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : ఎండా కాలం ప్రారంభమైందని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026’ ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతే కాకుండా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు వంగలపూడి అనిత. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధం చేయడంతో పాటు నిరంతర తాగునీటి సరఫరా, చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పశువుల రక్షణ, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే సూచనలను పాటించాలని కోరారు.





