రోడ్ల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాలి

VijayaBhaskar · March 12, 2026
Spread the love

ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళిక‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఇవాళ క‌మాండ్ కంట్రోల్ రూమ్ వేదిక‌గా రోడ్లు, భవనాల శాఖ పై సమీక్ష నిర్వహించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల ప్రణాళిక – అభివృద్ధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలించాలని అన్నారు సీఎం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రతిపాదించిన ఆయా ఆసుపత్రి భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.