రికార్డుల కంటే దేశం కోసం ఆడ‌ట‌మే ముఖ్యం

VijayaBhaskar · March 15, 2026
Spread the love

అంద‌రి మ‌న‌సులు దోచుకున్న సంజు శాంస‌న్

కేర‌ళ : ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌తీయ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో మ‌రో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి పాల్గొన్నాడు శాంస‌న్. తాను వ్య‌క్తిగ‌త రికార్డుల కోసం ఏనాడూ ఆడ‌లేద‌న్నాడు. కేవ‌లం దేశం కోసం ఆడ‌ట‌మే గొప్ప‌గా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. దీంతో సంజు శాంసన్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదే సంద‌ర్బంగా యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు . నా శతకాల గురించి చూస్తే, ఈ T20 ప్రపంచ కప్‌లో నేను మూడు శతకాలు సాధించే అవకాశాన్ని కోల్పోయానని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో, అంతకంటే గొప్ప విషయం ఒకటి జరిగిందన్నాడు.

అది ఏమిటంటే నేను నా జట్టు విజయానికి తోడ్పడ్డాను, తద్వారా మేము ట్రోఫీని గెలుచుకున్నామన్నాడు శాంస‌న్ . అవును, శతకం గురించి నేను అస్సలు ఆలోచించ లేదని మాత్రం నేను చెప్పను. ఒక మనిషిగా, ఆ ఆలోచన సహజంగానే మనసులో మెదులుతుంది. ఒకవేళ శతకం పూర్తయితే, ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆ కీలక సమయంలో, నేను నాతోనే ఇలా చెప్పుకున్నాను. నువ్వు నీ పరుగులు ఎలా సాధించావో ఒక్కసారి గమనించు. నేను శతకం చేయాలనే ఆలోచనతో నా ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేదు. ఆట మొదలుపెట్టినప్పుడు, నేను కేవలం నిర్దేశిత ప్రణాళికను అనుసరించడంపైనే దృష్టి పెట్టాలని, మరే ఇతర విషయాల గురించి ఆలోచించ కూడదని గ్రహించానని చెప్పాడు సంజు శాంస‌న్.