సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను మరికొన్నింటిని విస్తరిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా త్వరలో మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్న క్యాంటిన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు రాజస్థాన్లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 204 అన్న క్యాంటీన్లకు ఏడాదికి రూ.167 కోట్లు వ్యయం అవుతోందని అధికారులు తెలిపారు. అయితే అన్న క్యాంటిన్లను కార్పొరేట్ సంస్థలు, దాతల సాయంతో నడిపించేలా పటిష్టం చేయాలని సీఎం సూచించారు.
మరోవైపు అమరావతి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. 72 కి.మీ మేర పవర్ డక్ట్ ద్వారా అమరావతికి విద్యుత్ సరఫరా చేసే పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతిలో గాలి నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. పెద్దఎత్తున నిర్మాణం పనులు జరుగుతున్నందున స్ప్రింక్లర్ల వినియోగం ద్వారా దుమ్ము, ధూళిని కట్టడి చేయాలన్నారు. రాజధానిలో టిప్పర్లు ఓవర్ లోడ్తో వెళ్లకుండా, తప్పనిసరిగా కవర్లు కప్పేలా రవాణా జరగాలన్నారు. రాజధానిలోని అన్ని రోడ్లలో టిప్పర్లు తిరగకుండా… కొన్ని నిర్దేశించిన మార్గాల్లోనే వాటిని అనుమతించాలన్నారు. అమరావతిలో నిర్మించ తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ గురించి సీఎం చర్చించారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్లు సిద్ధమయ్యాయని అధికారులు తెలపగా, నెలాఖరులో వాటిని పరిశీలిస్తానని సీఎం చెప్పారు.





