టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

VijayaBhaskar · March 29, 2026
Spread the love

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో కోట్లు వాల్యూ చేసే స్థ‌లానికి క‌న్నం వేశార‌ని అన్నారు. దీనిపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్యే. తాను చేసిన ఆరోపణలు నిరూపించ లేకపోతే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్ర‌క‌టించారు నాయిని రాజేంద‌ర్ రెడ్డి.

హరీశ్ రావు, కేటీఆర్ లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలి, లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు . నేనిప్పుడే నా రాజీనామా పత్రం ఇస్తున్నా.. దమ్ముంటే వారు కూడా తమ రాజీనామా పత్రం ఇచ్చి సవాల్ స్వీకరించాలని అన్నారు నాయిని రాజేంద‌ర్ రెడ్డి. కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారని, ఎందుకు వీరిని జైల్లో వేయ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు స‌భా సాక్షిగా. పార్టీ కార్యాలయాల పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ఎమ్మెల్యే .