అంగ‌రంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

VijayaBhaskar · March 30, 2026
Spread the love

శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అంగ‌రంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండ రామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు భ‌క్త బాంధ‌వుల‌కు. ఇదిలా ఉండ‌గా క‌ళ్యాణోత్స‌వం సంద‌ర్బంగా టీటీడీ ఆద్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.