భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు
తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు . ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆద్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.







