రాజ‌ధాని అమ‌రావ‌తి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక

VijayaBhaskar · April 2, 2026
Spread the love

బిల్లుకు ఆమోదం పొంద‌డం సంతోషం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు.  రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది అని స్ప‌ష్టం చేశారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయిగా నిలిచి పోతుంద‌న్నారు సీఎం. అమరావతి ఇక అజేయం..అజరామరం అని అన్నారు.

ఇక నుంచి రాజధాని అమ‌రావ‌తి ని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం అని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ కి, హోం మంత్రి అమిత్ షాకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాన‌ని అన్నారు. గ‌తంలో మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధాన‌నుల పేరుతో డ్రామాలు ఆడార‌ని, ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు.