ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్శిటీ అధికారులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రా విశ్వ విద్యాలయానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులు, మహానుభావులను ఈ యూనివర్శిటీ అందించిందని అన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని తాను జనసేన పార్టీని స్థాపించానని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పేరు పేరునా యూనివర్శిటీ బాధ్యులను ప్రశంసించారు డిప్యూటీ సీఎం.
ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్ , యూనివర్శిటీ క్రీడా విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ మోహన్ , దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ పల్లవి , రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ కోటమరాజు శరత్ పాల్గొన్నారు.





