newsseals.com
News

ప్రాంతీయ పార్టీల‌ను అస్థిర ప‌రిచేందుకు కుట్ర‌

VijayaBhaskar April 10, 2026
newsseals-DKShivaKumar
Spread the love

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డీకే శివ‌కుమార్

త‌మిళ‌నాడు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్ర‌మే ఉండాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో డీకే శివ‌కుమార్ డీఎంకే కూట‌మి త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్బంగా త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెంగ‌ల్ప‌ట్టులో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ పై నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. ఇంకా రాజ‌కీయాల‌లో ఓన‌మాలు నేర్చుకోలేదంటూ ఎద్దేవా చేశారు.

ప్రాంతీయ పార్టీలను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు ఒక పెద్ద కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు డీకే శివ‌కుమార్ . కానీ మనమందరం ఏకమై, కలిసి పనిచేసినప్పుడు, అది అసాధ్యం అవుతుందని అన్నారు. మనం మళ్ళీ పుంజుకుంటాం, ఈ దేశాన్ని మరోసారి పరిపాలిస్తాం అని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో నమ్మకంతో ఉండాల‌ని పిలుపునిచ్చారు పార్టీ శ్రేణుల‌కు. సుమారు 20 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. తాము నిర్వ‌హించిన స‌ర్వేలో స్టాలిన్ సార‌థ్యంలోని డీఎంకే కూట‌మి మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రాబోతోంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.