చంద్ర‌బాబు విజ‌న‌రీ లీడ‌ర్ : రాష్ట్ర‌ప‌తి

VijayaBhaskar · April 13, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌స్తావించార‌ని తెలిపారు మంత్రి నారా లోకేష్‌. సోమ‌వారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీల‌తో క‌లిసి మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి తో భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై సంత‌కం చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని కోసం తాము ప‌డిన క‌ష్టం గురించి ఏక‌రువు పెట్టారు నారా లోకేష్‌. రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని చెప్పారు. గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. 

కోట్లాది ప్ర‌జ‌ల కోరిక అయిన అమ‌రావ‌తి చ‌ట్టం త‌న హ‌యాంలో రూపొంద‌డం సంతోషంగా ఉంద‌ని, రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండి పోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పథంలో ప‌య‌నించాల‌ని, రాజ‌ధాని ప‌నులు నిర్విఘ్నంగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.