కేటీఆర్ కామెంట్స్ ఎంపీ చామల సీరియస్

ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన సాగిస్తున్న సర్కార్ ను కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్పడం దారుణమన్నారు. KTR తెలంగాణ రాష్ట్రంలో అవాస్తవ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత తొమ్మిదేళ్ల BRS పాలనలోనే తెలంగాణకు, హైదరాబాద్కు అంతా జరిగిపోయినట్లుగా ఆయన మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ , రాష్ట్రం రెండింటి అభివృద్ధిలోనూ కాంగ్రెస్ కీలకమైన, ప్రాథమిక పాత్ర పోషించిందని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్లోనూ, తెలంగాణలోనూ అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ రాష్ట్రానికి ఒక సానుకూల ఆలోచనా విధానాన్ని అందించిందని చెప్పారు ఎంపీ. BRS పాలనలో, వారు రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఈ పాలనా కాలంలో KCRకు ఒక అత్యంత విలాసవంతమైన ఫామ్హౌస్ సమకూరడమే తప్పా మరోటి కాదన్నారు. మీరు అధికారాన్ని కోల్పోయారు కాబట్టే మీకు నిద్ర కరువైందన్నారు ఎంపీ.