నిప్పులు చెరిగిన తలసాని శ్రీనివాస్
హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. తనకు మాజీ సీఎం, తమ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. రాచరిక పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రాలేదని సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
ఇంకోసారి తమ అధినాయకుడిపై చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒకవేళ కేసీఆర్ గనుక బయటికి వస్తే మాత్రం వణుకు పుట్టడం ఖాయమన్నారు. గతంలో ఓ సారి బయటికి వస్తే కృష్ణా జలాల వివాదంలో ప్రభుత్వం తర్జన భర్జన పడిందని, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు, మీ నాయకులకు బాగా తెలుసన్నారు. కేసీఆర్ జగిత్యాల పర్యటన ఉందని తెలిశాక రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని సందర్శిస్తామని సీఎం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్.





