తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

VijayaBhaskar · April 20, 2026
Spread the love

ఇక నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్ర‌యాణం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో నిత్యం ఎంఎంటీఎస్ లో ప్ర‌యాణం చేసే వారికి తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ఉచిత ప్ర‌యాణం చేసేందుకు , వెసులుబాటు క‌ల్పించేందుకు ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిపారు సీఎస్ రామ‌కృష్ణా రావు. ఈ సంద‌ర్భంగా కేంద్ర రైల్వే బోర్డుకు ఉచిత ప్ర‌యాణానికి గాను అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది తెలంగాణ స‌ర్కార్. కాగా రైల్వేకు వచ్చే ఆదాయ లోటును భరించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాకుండా ర‌ద్దీని త‌గ్గించేందుకు గాను ఎంఎంటీఎస్ స్టేషన్ల వరకు ఆర్టీసీ షటిల్ బస్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తోంది స‌ర్కార్. ఈ ఆలోచ‌న‌ను గ‌తంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ , క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స‌ర్కార్, త‌మిళ‌నాడులో డీఎంకే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్నాయి.