ఏపీని అప్పుల‌పాలు చేసిన జ‌గ‌న్ రెడ్డి

VijayaBhaskar · April 28, 2026
Spread the love

నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఏపీని అప్పుల పాలు చేసిన క్రెడిట్ జగన్ రెడ్డిదేన‌ని అన్నారు. ఆయన పాలనలో సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి అండర్‌వేర్ కంపెనీల వరకు అన్నీ పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు. కియా ఎక్స్‌పాన్షన్, అమర్ రాజా బ్యాటరీస్ వంటి సుమారు 40 భారీ పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని మండిప‌డ్డారు. ఐదేళ్ల కాలంలో కల్తీ మద్యం ఏరులై పారించి, సుమారు 30 వేల మంది ప్రజల ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసిన పాపం ఆయనదేన‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకం ‘జే-బ్రాండ్’ మద్యాన్ని ఏరులై పారించి, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఘనత జగన్ ది అన్నారు. అదేవిధంగా ఇసుక రీచ్‌లను అడ్డాగా చేసుకుని వేల కోట్లు దోచుకున్నార‌ని ఆరోపించారు.

ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వాసంశెట్టి సుభాష్‌. వారి కుటుంబాల్లోని కోటి మంది జీవితాల్లో జగన్ రెడ్డి చీకట్లు నింపారన్నారు. కార్మికుల సంక్షేమ పథకాలను ఒకే ఒక్క జీవోతో ఆపేసి, వారిని రోడ్డున పడేసిన పాపం జగన్ కే దక్కుతుంద‌న్నారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో హత్యా రాజకీయాలను పెంపొందించార‌ని మండిప‌డ్డారు మంత్రి. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను మానసిక వేదనకు గురిచేసి చనిపోయేలా చేశార‌న్నారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, మృతదేహాన్ని ఇంటికే ‘డోర్ డెలివరీ’ చేసిన భయంకరమైన సంస్కృతి జగన్ టీమ్ ది కాదా? అని ప్రశ్నించారు.