newsseals.com
News

కార్మిక వ‌ర్గాల‌కు సీఎం శుభాకాంక్ష‌లు

VijayaBhaskar May 1, 2026
newsseals-CM
Spread the love

నేడు అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం

హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం మేడే సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మిక వ‌ర్గ‌ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న‌ట్టు పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్ప‌ష్టం చేశారు. శ్రామికులే త‌మ ప్ర‌భుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహద పడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్ర‌జా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మే డే స్ఫూర్తితో రాష్ట్ర‌ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంద‌న్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్ర‌భుత్వం అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామ‌న్నారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు తీసుకువ‌చ్చిన‌ట్టు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించడం జరిగిందన్నారు. గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు .