కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిమంతుడు అని ప్రశంసలు కురిపించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. శుక్రవారం పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. AMCAతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీ లోని ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం వేదిక వద్ద మిస్సైల్ లు, హ్యాండ్ గ్రేనేడ్, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం ప్రొటోటైప్ లాంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. ఇప్పుడు 5 తరం స్టెల్త్ యుద్ధ విమానం తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోందన్నారు. రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొద్దిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేరిందన్నారు. అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని చాటేలా మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయన్నారు.





