జూన్ 6వ తేదీ నుండి 14 వరకు బ్రహ్మోత్సవాలు
తిరుపతి జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి జిల్లాలోని పుణ్య క్షేత్రం కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. ఈ సందర్బంగా ప్రతి రోజూ వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా శ్రీ వేణు గోపాల స్వామికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన జూన్ 9న స్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది టీటీడీ. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు అని తెలిపింది. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం ప్రసాదంగా అంద జేయనున్నట్లు పేర్కొన్నారు జేఈవో వి. వీరబ్రహ్మం. మరో వైపు పుష్ప యాగం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు పుష్పయాగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.








