తిరుపతి : తిరుపతి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని తెలిపింది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారని పేర్కొంది టీటీడీ.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపింది. ఈ సందర్బంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే సాలకట్ల సాక్షాత్కార వైభవోపేత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది టీటీడీ.






