తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. దీంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో స్వామి వారి ఆలయంలో కీలకమైన ఉత్సవాలు జరగనున్నాయని , దీని కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఆయా తేదీలను భక్తుల సౌకర్యార్థం వెల్లడించారు. 14న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని, కావున 14, 17వ తేదీలలో రెండు రోజుల పాటు బ్రేక్ దర్శనాలు ఉండవని తెలిపారు. ఆణివార ఆస్థానం ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇందు కోసం టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోందన్నారు ఈవో.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ దర్శనం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందన్నారు ముద్దాడ రవిచంద్ర. ఈ నేపథ్యంలో జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపారు. అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరించాలని భక్తులను కోరారు.







