తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు కన్నబాబు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కె.కన్నబాబు కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
జీవితంలో మరిచి పోలేని అనుభూతిని పొందానని పేర్కొన్నారు. వృత్తి పరంగా ఎన్నోసార్లు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. అయితే అధికారికంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హొదాలో టీటీడీ పాలక మండలికి సంబంధించి ఎక్స్ అఫిసియో మెంబర్ గా సంతకం చేయడం మరిచి పోలేనని పేర్కొన్నారు. ఇదంతా ఆ కలియుగ దైవం కల్పించిన మహత్ భాగ్యంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు కె. కన్నబాబు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు, సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత టీటీడీ ఇస్తుందని స్పష్టం చేశారు.






