ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్
బెంగళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు అధిష్టానం ముఖ్యమంత్రి సిద్దరామయ్యని, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని పిలిచిందని అన్నారు. అంతే కాకుండా మరో 15-20 రోజుల్లోనే పలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయని చెప్పారు. కాబట్టి, వారు అధిష్టానంతో ఆ విషయాల గురించి కూడా చర్చిస్తారని తెలిపారు.
పార్టీ పరంగా , ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు తమ అగ్ర నేతలు సమాలోచనలు చేస్తుంటారని, ఇందులో ఎలాంటి తప్పుందంటూ ప్రశ్నించారు ప్రియాంక్ ఖర్గే. మా నాయకులు, శాసనసభ్యులు , మండలి సభ్యులు మా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి వెళ్లడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. ఒకవేళ వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరేందుకు వెళ్ల లేదు కదా అంటూ సెటైర్ వేశారు ప్రియాంక్ ఖర్గే. అలా అయితే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుందన్నారు మంత్రి.





