అదంతా అబద్దమని ఖండించిన మంత్రి అనిత
అమరావతి : తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఓ వైపు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు సంచలనంగా మారితే తాజాగా నాగేశ్వర్ రావు నోరు జారడం, ఆపై కేసు నమోదు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ నెలకొంది. ఇప్పటికే జనసేన పార్టీకి చెందిన ఒకరు తనపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు, మంత్రి నాదెండ్ల మనోహర్ కు సారీ కూడా చెప్పారు నాగేశ్వర్ రావు. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. తనకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ కు రానున్నారని.
దీనిపై సీరియస్ గా స్పందించారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. పోలీసులు తన ఇంటికి వెళ్లలేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదంతా “నకిలీ వార్త” (Fake News) అని ఆమె పేర్కొన్నారు .పోలీసులు అటువంటి చర్యలేమీ చేపట్టలేదని స్పష్టం చేశారు. దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన , పోలీసు చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను నొక్కి చెప్పారు మంత్రి, ప్రజలు ధృవీకరించబడిన విశ్వసనీయ వనరులనే ఆధారంగా చేసుకోవాలని, నిర్ధారణ కాని వార్తలను ఇతరులతో పంచుకోవడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.





