వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి చాటి చెప్పిన చారిత్రాత్మక వేదిక మహానాడు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారతకు అండగా నిలిచిందని, ఈసారి “స్త్రీశక్తి” నినాదంతో మహానాడు నిర్వహించడం గర్వ కారణమన్నారు. మహిళా శక్తి, యువశక్తి, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో మహానాడు-2026 కొత్త దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
మహిళల అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది అని పార్టీ ఎప్పటినుంచో నమ్ముతోందన్నారు . మహానాడు-2026 కేవలం పార్టీ సమావేశం కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్కు దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదిక అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా నడిపించే సంకల్పానికి ఇది తొలి మెట్టు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పెట్టుబడులు తీసుకు రావడం, పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం మహానాడు ప్రధాన ధ్యేయాల్లో ఒకటన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.





