స్పష్టం చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్
అమరావతి : నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు.. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతణ్ని రిక్రూట్మెంట్ చేయలేక పోయాం అన్నారు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్. ఆ తర్వాత నవీన్ కోర్టుకు వెళ్లాడు… కోర్టుల్లో మేమూ మా వాదనలు వినిపించాం. కోర్టు మా వాదనను బలపరిచింది. నవీన్ కేసులో కోర్టులు చెప్పినట్టే నడుచుకున్నాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు… తప్పు పట్టలేదు. హారిజంటల్ రిజర్వేషన్లను కొందరు అర్థం చేసుకోలేక పోయారు.
ప్రస్తుతం పేపర్లల్లో వస్తున్న వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. ఆధారాలతో సహా వచ్చాను. స్పోర్ట్స్ కోటాలో కూడా ఎలాంటి తప్పులు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు అని శశిధర్ చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ-ప్రైవేట్ బడుల మధ్య కాంపిటేషన్ ప్రారంభమైంది. మా టీచర్లు పిల్లల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. డీఎస్సీ-2025లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి పైకి వచ్చిన వారే. డీఎస్సీ నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దు… ఏమైనా చెప్పాలనుకుంటే నిజాలు చెప్పండి. జరుగుతున్న అవాస్తవ ప్రచారంతో కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారందరూ బాధపడతారు. టీచర్లెవ్వరూ బాధపడొద్దని కోరుతున్నాను. శాఖాపరంగా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి.. నేర్చుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. త్వరలో మరో డీఎస్సీని కూడా నిర్వహిస్తాం. దానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపొద్దు. నిజాలనే రిపోర్ట్ చేయండి.. దయచేసి అబద్దాలు మాత్రం చెప్పొద్దు. ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాం అని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.






