చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై మండిపడ్డారు. మరో వైపు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని కంపెనీలు ప్రయోజనాలు పొందుతూ పన్నులు కట్టడం లేదని మండిపడ్డారు. ఇందులో భాగంగా చెట్టినాడ్ సిమెంట్స్ పన్ను వసూళ్లలో అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. పంచాయతీలు బాగుపడాలి.. నాలుగు గ్రేడ్లకు డిఫరెంట్ స్లాబ్స్ తో టాక్సులు నిర్ధారించాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు కూడా గ్రేడ్లు నిర్ణయించాలన్నారు. కరెంటు వాడేసుకుని బిల్లు కట్టమంటే కోర్టుకి ఎలా వెళ్తారు.. ఉచితంగా విద్యను అందిస్తూ ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే అర్ధం ఉంటుంది.. లక్షలకి లక్షలు ఫీజులు తీసుకుని పన్ను కట్టకుండా ఉంటే ఎలా అని సీరియస్ గా ప్రశ్నించారు.
ఈ విషయంపై ప్రజలకి ఏం సమాధానం చెబుతాం. వారిని వదిలేసి మమ్మల్ని పీడిస్తున్నారని ప్రజలు అంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాన్. గత 30 ఏళ్లలో పంచాయతీల ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వండి. పన్ను చెల్లింపుల వ్యవహారంలో మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటే వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పన్నుల వసూళ్లలో అవకతవకలు సహించం. తాళ్లపాలెం, చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్ను వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





