గొడ్డలి పార్టీ ఆరోపణలు తప్పని నిరూపించాం
గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తు పెట్టుకుంటామని, కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తామన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసినా ఓడిపోయారు.. ఆ తర్వాత పట్టుపట్టి పని చేశారు. 2024లో అద్భుత విజయం సాధించారు. గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో లోకేష్ చక్కగా పని చేస్తున్నారు..ఇప్పుడు మంగళగిరి టీడీపీకి కంచుకోట అని అన్నారు.
యుద్దాన్ని గెలిపించే బాధ్యత నాది… నాతో పాటు అలుపెరగకుండా యుద్దం చేసే బాధ్యత మీది. రాష్ట్రంలోని ప్రతి బూత్ లోనూ గతానికి మించి ఓట్లు రావాలని అన్నారు.
కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తాం… అన్ని రకాలుగా అండగా ఉంటాం… ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి గొడ్డలి పార్టీ చేతులేసింది… సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని పక్కన పెట్టేసింది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గొడ్డలి పార్టీ మాట తప్పింది. ఇంతటితో ఆగకుండా వ్యవస్థలను విధ్వంసం చేసిందని అన్నారు. వాళ్లు చెప్పినవి చేయకపోగా మనం నిర్వహించిన డీఎస్సీ-2025పై బురద జల్లారు. కానీ అభాసు పాలయ్యారంటూ ఎద్దేవా చేశారు సీఎం.





