మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
నల్లగొండ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇందుకు సంబంధించి భారీ సభ నిర్వహిస్తున్నామని, సభను సక్సెస్ చేసేందుకు గాను జూన్ 13న సమీక్ష సమావేశం చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దర్వేష్పురం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నల్గొండలో తెలంగాణలోనే గత రెండున్నరేళ్లలో ఇదే అతిపెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
₹13,000 కోట్ల రోడ్డు అభివృద్ధి పనులతో తెలంగాణ ముఖచిత్రం మారి పోతుందని, రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు 24 గంటల పాటు కృష్ణా జలాలను అందించేందుకు ₹125 కోట్లతో కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. దీనికి కూడా ముఖ్యమంత్రి పర్యటన రోజునే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.





