టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం

VijayaBhaskar · June 14, 2026
Spread the love

శ్రీ‌వారికి వెల్లువెత్తుతున్న విరాళాలు

తిరుమ‌ల : కోరిన కోరిక‌లు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం నిత్యం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో సామాన్యుల నుంచి బ‌డా బాబుల దాకా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ల‌క్ష‌లాది మంది హుండీలో డ‌బ్బుల‌తో పాటు కానుకలు కూడా స‌మ‌ర్పించు కుంటున్నారు. ఇదిలా ఉండగా భ‌క్తుల‌తో పాటు ప్ర‌ముఖ పేరు పొందిన సంస్థ‌లు, కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు తోచిన రీతిలో కానుక‌లు చెల్లిస్తున్నారు.

తాజాగా బార‌త దేశంలో అత్యంత పేరు పొందిన వాహ‌నాల త‌యారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్ చార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.