చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా

VijayaBhaskar · June 14, 2026
Spread the love

కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం
అమ‌రావ‌తి : కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించు కోవాలని తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ , ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని చెప్పారు.

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలిక ఆచూకి కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు.