రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్ను కోరిన BRS నేత క్రిశాంక్
రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం అందజేశారు. ఈ భూమి చారిత్రాత్మకంగా పోరంబోకు సర్కారీ ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైందని క్రిశాంక్ వెల్లడించారు. 1955 నుంచి ఉన్న రికార్డులు, న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను సమర్థించాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల అండతో వందల కోట్ల విలువైన భూమిని భూ మాఫియా ఆక్రమిస్తోందని ఆరోపించారు.
2025లో ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ఎమ్మెల్యే గణేష్, మంత్రి పొంగులేటి ప్రతిపాదించారని గుర్తు చేశారు. ప్రస్తుతం భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. భూమి హక్కులు, సరిహద్దులు, ప్రస్తుత స్థితిపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేశారు క్రిశాంక్. అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగి ఉంటే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు . 6000 ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. వినతి పత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ ప్రియాంక ఆల తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.