ఈ నేరగాళ్లు పరాన్నజీవులని షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఒక నిందితుడిపై నమోదైన వివిధ ఎఫ్ఐఆర్లను (FIRs) ఏకీకృతం చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అమాయక పెట్టుబడిదారులను మోసం చేసే సైబర్ నేరగాళ్లను “పరాన్నజీవులు”గా అభివర్ణించిన సుప్రీంకోర్టు, సమాజ ప్రయోజనాల దృష్ట్యా అటువంటి నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని బుధవారం పేర్కొంది. అమాయక పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేసి వారిని మోసం చేసే సైబర్ నేరగాళ్లు “పరాన్నజీవులు” అని, వారి పట్ల చాలా కఠినంగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది.
వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కొన్ని ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మీరు (సైబర్ నేరగాళ్లు) పరాన్నజీవులు, అమాయక పెట్టుబడిదారుల నుండి డబ్బు తీసుకుని వారిని మోసం చేస్తారు. సైబర్ నేరగాళ్ల పట్ల మనం చాలా కఠినంగా వ్యవహరించాలి అని ప్రధాన న్యాయమూర్తి (CJI) పేర్కొన్నారు. ఇటువంటి నేరాల బాధితులు దేశవ్యాప్తంగా ఉంటారని ఆయన అన్నారు. మీరు తమిళనాడులో ఒకరిని మోసం చేస్తారు, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కు, ఆపై ఈశాన్య ప్రాంతాలకు వెళ్తారు అని పేర్కొన్న CJI, సైబర్ నేరగాళ్లను జైలులో ఉంచడం సమాజ ప్రయోజనాలకు మంచిదని అన్నారు.





